ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి నజ్మా హెఫ్తుల్లా

కేంద్రంలోని ప్రతిపక్ష ఎన్టీఎ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా రాజ్యసభ మాజీ డెప్యూటీ ఛైర్‌పర్సన్ నజ్మా హెఫ్తుల్లాను బరిలోకి దించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్టీఎ కూటమి పార్టీలు సమైవేశమై ఆదివారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ సమావేశానికి కూటమిలోని ఇతర పార్టీలైన శివసేన, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్టు 10 వ తేదీన జరుగుతాయి. ఇప్పటికే అధికార యూపీఎ కూటమి అభ్యర్ధిగా మాజీ దౌత్యవేత్త హమీద్ అన్సారీని రంగంలోకి దించగా, యూఎన్‌పీఎ కూటమి అభ్యర్ధిగా రషీద్ మసూద్‌ను బరిలోకి దించారు. 67 సంవత్సరాల నజ్మా హెఫ్తుల్లా దాదాపు 27 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యురాలుగానూ, 17 ఏళ్లు డెప్యూటీ ఛైర్మన్‌గా పనిచేసిన విశేషానుభవం ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన నజ్మా, 2004లో భాజపాతో జట్టుకట్టారు. గతంలో ముస్లిం ఉపరాష్ట్రపతులగా జాకీర్ హుస్సేన్, ఎం.హిదయతుల్లా పనిచేశారు.

Close