|
|  |
రాష్ట్రవ్యాప్తంగా పేద వ్యవసాయదారులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందజేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విధానాన్ని అమలు చేస్తే రైతుల స్థితిగతులు మెరుగవుతాయని ఆయన అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్లో గురువారం పార్టీ నేతలతో సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికార ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్తును అందజేయడం ద్వారా వారి స్థితిగతులను మరింతగా మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల వేలం కార్యక్రమాన్ని ఆపాలని మరోసారి ప్రభుత్వాన్ని బాబు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ముందుగా రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందజేస్తామన్నారు. అలాగే బెల్టు షాపుల నిషేధం, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర కార్యక్రమాలను చేపడతామన్నారు.మద్యనిషేదాన్ని కూడా విధిస్తామన్నారు. ఈ అంశాలన్నీ కూడా ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరచనున్నట్లు తెలిపారు. అలాగే మధ్యంతర ఎన్నికలు తప్పవని, అందులో తమ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.
|
|