|
|  |
కాంగ్రెస్ , సిపిఎంలు ఆడుతున్న డ్రామాని కట్టిపెట్టి మధ్యంతరానికి సిద్ధంకావాలని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. కమ్యూనిస్టులకు ఎన్నికలంటే భయమేలేకుంటే మద్ధతు ఉపసంహరించుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు సిద్ధంకావాలని సోనియాగాంధీ కాంగ్రెస్ నేతలకు సంకేతాలు ఇచ్చిందన్నారు. ఆదివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యంతర ఎన్నికల్లో స్థిరమైన ప్రభుత్వం, నాయకత్వం అంశాలే ప్రధానంగా తీసుకుంటామని చెప్పారు. దీంతోపాటుగా ఓటుబ్యాంకు రాజకీయాలూ అంశం అవనున్నాయని పేర్కొన్నారు. ఓడదాటాక బోడిమల్లన్న అన్నట్లుగా జెడిఎస్ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దానికి లౌకిక రంగు పుయ్యాలనుకున్నా అది అతికినట్లు లేదన్నారు. జెడిఎస్ రాజకీయ విలువలను దిగజార్చిందని విమర్శిచారు. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని గవర్నర్ ను కోరతామని తెలిపారు. నమ్మకద్రోహానికి కర్ణాటక ప్రజలు తగిన బుద్ధిచెబుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ దొడ్డిదారి నాటకం ఆడాలనుకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. కొన్ని పార్టీలకు అవసరమైనపుడు బిజెపి మంచి పార్టీలాగా అనిపిస్తుందన్నారు. అవసరం తీరగానే మతతత్వ పార్టీలా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. 'టిడిపి ఇప్పుడు వామపక్షాలతో కలిస్తే లాభముంటుందని భావించింది.. కాబట్టి వారి వెంట పడుతోంది.. వారేమో ఏమీ తెల్చడంలేదు' అన్నారు.
|
|