|
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తిరిగి పాక్ వెళ్లేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.షరీఫ్ కోరుకుంటే అతను తిరిగి పాకిస్థాన్ వెళ్లవచ్చని సౌదీ అరేబియా ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని పీఎంఎల్- ఎన్ తాత్కాలిక అధ్యక్షుడు మఖ్దూమ్ జావేద్ హాష్మీ పేర్కొన్నారు.అతను తిరిగివచ్చేందుకు అవసరమైన నిబంధనలను నవంబర్లో ఖరారు కానున్నట్లు షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్- ఎన్ పార్టీ తెలిపింది. జనవరి మధ్యలో జరగనున్న పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు షరీఫ్ తిరిగిరారని ఆ దేశ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికార పీఎంఎల్- క్యూ పార్టీ నేతలతో గురువారం చెప్పారు. అయితే ముషారఫ్ ప్రకటన వెలువడిన ఓ రోజు తరువాత పీఎంఎల్- ఎన్ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. సెప్టెంబర్ 10వ తేదీన పాక్ తిరిగివచ్చిన షరీఫ్ను అక్కడి ప్రభుత్వం నాలుగు గంటల్లోనే మళ్లీ దేశం నుంచి పంపివేసిన విషయం తెలిసిందే. జైలు శిక్షలను తప్పించుకునేందుకు షరీఫ్ పదేళ్ల పాటు దేశం వెలుపల గడుపుతానని పాక్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సుప్రీంకోర్టు షరీఫ్ పాక్ తిరిగివచ్చే స్వేచ్ఛ ఉందని సంచలన తీర్పు ఇవ్వడంతో 1999నాటి దేశ బహిష్కరణ తరువాత సెప్టెంబర్ 10న తొలిసారి షరీఫ్ పాక్ తిరిగి వచ్చారు. అయితే ఆయన్ను విమానాశ్రయం నుంచే పాక్ ప్రభుత్వం సౌదీ అరేబియాకు పంపివేసింది.
|