|
|
|
హైదరాబాద్: చంద్రబాబును ముఖ్యమంత్రి అవమానించారనే విమర్శలో నిజం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్న మాటల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఒక్కరికే వ్యంగ్యం కనిపించిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి ఏదైనా అంటే వ్యంగ్యం, అనకపోతే అహంకారం అంటారని ఆయన అన్నారు. చంద్రబాబు తన ధోరణిలో తాను మాట్లాడుకుంటూ పోతుంటే కోపం వచ్చిందని భావించి కోపం వద్దు సార్ అని ముఖ్యమంత్రి అన్నారని, అది వ్యంగ్యం కాదని ఆయన చెప్పారు. నమస్కారం పెట్టి కోపం వద్దంటే వ్యంగ్యం ఎలా అవుతుందని ఆయన అన్నారు. చూస్తాను అని చంద్రబాబు అంటే తాము కూడా చూపిస్తామని ముఖ్యమంత్రి అన్నారని, ఆ మాటలను తాను తిరిగి అనదలుచుకోలేదని ఆయన అన్నారు.
|
|