|
|
ప్రసవ వేదనతో ఆసుపత్రికి వచ్చిన నిండు చూలాలిని ప్రభుత్వ వైద్యులు రోడ్డుపైకి గెంటేశారు. కాళ్లు మొక్కినా కనికరించకుండా తామేం చేయలేమని చేతులెత్తేశారు. అదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం పుల్లగామకు చెందిన గేడెం సుగుణ ప్రసవం కోసం ఆదివారం రాత్రి చెన్నూరు ఆసుపత్రికి వచ్చింది. రక్తహీనతతో కాన్పు కష్టమౌతుందని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రాత్రి పన్నెండున్నరకు అంబులెన్సు ఇచ్చి కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి పంపారు. సుగుణ తన అత్త సూరక్కతో కలిసి సోమవారం తెల్లవారుజామున గోదావరిఖని ఆసుపత్రికి చేరుకుంది. ఆమెను పరీక్షించిన డ్యూటీ డాక్టర్ మహేష్ ఎలాంటి వైద్యం చేయకుండానే కరీంనగర్కు వెళ్లాలని సూచించారు. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో పురిటి నొప్పులతో ఏడ్చుకుంటూ బయటకు వెళ్లిన సుగుణ మధ్యాహ్నం 3 గంటలకు ఆసుపత్రి సమీపంలోని శారదానగర్ రోడ్డుపై ప్రసవించింది. ''అయ్యా, నా కోడలిని కాపాడమని కాళ్లు మొక్కినా డాక్టర్లు కనికరించలేదు. కరీంనగర్కు పొమ్మని వెళ్లగొట్టారు. డాక్టర్ల మీద నమ్మకంతో అంతదూరం నుంచి వచ్చినా వారు పట్టించుకోక పోవడంతో నా కోడలు రోడ్డుపైనే ప్రసవించింది. ఈ పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు'' అని సూరక్క వాపోయారు.
|
|