|
|
 |
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేట వద్ద తాడిపూడి సాగునీటి ప్రాజెక్టును వై యస్ రాజశేఖరరెడ్డి గురువారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మట్లాడుతూ తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తమది మాట తప్పని ప్రభుత్వమని ఆయన చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్వర్గీయ ఎన్టీ రామారావును పదవీచ్యుతుణ్ని చేశాడని, ఎన్టీ రామారావు పథకాలను నీరు గార్చారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యనిషేధాన్ని ఎత్తివేశారని, రైతుల కరెంటు చార్జీలు పెంచారని, రెండు రూపాయలకు కిలో బియ్యం ధర పెంచారని, ఈ రకంగా చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాటను తప్పారని ఆయన అన్నారు. వరికి వేయి రూపాయల మద్దతు ధర రాబట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని, అన్ని పంటల మద్దతు ధరలు 50 శాతం పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం మాట ఎత్తడానికి కూడా భయపడిందని ఆయన అన్నారు.
|
|