|
|
 |
పల్లెటూరు బస్సులు పల్లె ప్రజలకు ఇబ్బందిని తెచ్చిపెడుతున్నాయి.ఆర్టీసీ తమకు నష్టాలు వస్తున్నాయంటూ గత రెండు సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గిస్తోంది.ఈ విధంగా రద్దు చేసిన బస్సుల్ని లాభావచ్చే రూట్లకు తరళిస్తోంది. దీనివల్ల కొన్ని ఊళ్లకు ఊళ్లే బస్సు సౌకర్యానికి దూరమవుతున్నాయి. ఇది సెట్విన్ వంటి ప్రైవేటు వాహనాలకు వరంగా మారింది. హైదరాబాద్ ను చూసి రాష్ట్రమంతటా ఆర్టీసీని దెబ్బతీయడానికి సెట్విన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీ ఆధిపత్యాన్నే పశ్నించే స్థితికి సెట్విన్ చేరుకుంటోంది. ప్రస్తుతం ఆర్టీసీలో అద్దె బస్సులతో కలిపి 19,000 బస్సులున్నాయి. ఇందులో 10,000 బస్సులు గ్రామీణ రూట్లలో తిరుగుతున్నాయి. గతంలో రోడ్డు సౌకర్యం ఉండే అన్ని గ్రామాలకు లాభనష్టాల భేదం లేకుండా ఆర్టీసీ బస్సులను కొనసాగించేది. గ్రామీణ రూట్లలో తిరిగే దాదాపు చాలా బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో మొదట్నుంచీ పూర్తిస్థాయిలో లేనందు వల్ల నష్టాలు వస్తున్నాయి. అయితే ఆర్డినరీ బస్సుల నష్టాలను మిగిలిన ఎక్స్ ప్రెస్ తదితర కేడర్ బస్సులు కప్పిపుచ్చడం తో ,ఈ రెండేళ్ల వరకు గ్రామీణ రూట్లలో నష్టాల గురించి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కొద్దికాలంగా ఆర్టీసీ అధికారులలో మార్పువచ్చింది. నష్టాల రూట్లలో బస్సుల్ని ఎందుకు నడపాలన్న ఆలోచన ఆర్టీసీ అధికారులలో వచ్చింది. ఈ రూట్లలో బస్సుల్ని తగ్గించి వాటిని లాభాల రూట్లకు మార్చే పనిని కొద్దికాలంగా చాపకింద నీరులా ఆర్టీసీ మొదలుపెట్టింది. ఇలా ఇప్పటిదాకా 2000 రూట్లలో తిరుగుతున్న బస్సుల సంఖ్యను తగ్గించారు. ఆటోలు విజృంభిస్తున్న కొన్ని గ్రామాలకు బస్సుల్ని పూర్తిగా రద్దుచేసిన సమయాలు కూడా ఉన్నాయి.కొన్ని రూట్లలో మాత్రం తిరిగే బస్సుల సంఖ్యను కుదించారు.
|
|