|
|
 |
ముంబై పేలుళ్ల కేసులో తీర్పుకాపీ అందుకొని, టాడా న్యాయస్థానం ఎదుట లొంగిపోయిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరోమారు జైలు జీవితంలోకి అడుగుపెట్టారు. సోమవారం లొంగిపోయిన సంజయ్ దత్ ను మొదట ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో కొంతసేపు ఉంచిన పోలీసులు, అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో పూణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. గంటకు 130 కి.మీ వేగంతో రెండున్నర గంటల రికార్డు సమయంలో పోలీసు వాహనాలు మీడియాను తప్పించుకొని ఎరవాడ జైలుకు చేరుకున్నాయి. ఎరవాడ జైలుకు చేరుకున్న సంజయ్ కు మంగళవారం పూర్తి స్థాయి వైద్య పరీక్షలను నిర్వహించారు. పోలీసు అధికారులు ఈ మేరకు వివరాలందిస్తూ సంజయ్ గతంలో ఈ జైలుకు వచ్చినప్పుడు వడ్రంగం పట్ల ఆసక్తిని కనబరిచారని, ఇప్పుడు కూడా ఆయన దానివైపే మొగ్గుచూపవచ్చని తెలిపారు. దత్ రాకతో జైలు వాతావరణం హడావుడిగా మారింది. ఇదిలా ఉండగా, సంజయ్ దత్ ను బెయిల్ పై బయటకు రప్పించేందుకు ఆయన తరపు న్యాయవాదులు ఫర్హానా షా, సతీష్ మనెషిండేలు సన్నాహాలు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో వచ్చేవారం బెయిల్ పిటిషన్ సమర్పించనున్నట్లు వారు తెలిపారు
|
|